కుత్బుల్లాపూర్,మే13 : అడవుల సంరక్షణలో అటవీక్షేత్రాధికారి ఉద్యోగం చాలా కీలకమని, శాఖకు వెన్నముక వంటిదని రాష్ట్ర అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోని అటవీ అకాడమీ కేంద్రంలో 7వ బ్యాచ్ అటవీ క్షేత్రాధికారుల శిక్షణా కార్యక్రమం స్నాతకోత్సవం వేడుకలు జరిగాయి.
తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీశ్ఘడ్, హిమాచల్ప్రదేశ్, జమ్మికాశ్మీర్, నాగాలాండ్ రాష్ర్టాలకు చెందిన అటవీ క్షేత్రాధికారుల 18 నెలల శిక్షణ ముగింపు సందర్భంగా పలు అంశాలలో ప్రతిభను కనబర్చిన శిక్షణాధికారులకు వెండి, బంగారు పతకాలను అందజేశారు. తమిళనాడుకు చెందిన కుమారిదీప నాలుగు బంగారు పతకాలు,రెండు వెండిపతకాలను సాధించి బ్యాచ్ టాపర్గా నిలిచింది.
ఈ సందర్భంగా రాకేశ్మోహన్ డోబ్రియాల్ మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి, శితోష్ణస్థితి మార్పు నేపథ్యంలో అటవీ అధికారుల పాత్ర గణనీయంగా ఉందన్నారు. అందరికి పని చేసే వాతావరణాన్ని కల్పించాలని, వ్యవస్థలో భాగంగా సమిష్టిగా కృషి చేసి అటవీ సంరక్షణకు భాద్యతగా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖా ప్రధాన సంరక్షణాధికారి స్వర్గం శ్రీనివాస్, అకాడమీ డైరెక్టర్ పీవీ రాజారావు, విశ్రాంత అటవీ సంరక్షణాధికారులు పి.రఘువీర్, మునీంద్ర, తిరుపతయ్యలతో పాటు, అదనపు సంచాలకులు ఎస్.రమేశ్, జె.వసంత, రామమోహన్, షేక్నాగిని భాను, ఎన్ఆర్.సంగీత, వంశీకృష్ణ, కోర్సు సహాయ సంచాలకులు సుభాష్చంద్ర తదితరులు పాల్గొన్నారు.