హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 80 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్న నేపథ్యంలో పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొలువు కొట్టాలనే తాపత్రయంలో నిద్రాహారాలు మాని పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. ఉద్యోగ సన్నద్ధతలో ఆహారం ఎంతో కీలకం. ఎప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? మనస్సును ఉత్తేజపరిచే ఆహారం ఏంటి? మేధస్సును పెంచే ఆహారం ఏంటి? వంటి సందేహాలకు సమాధానమిచ్చారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అశ్వినీసాగర్. ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు మీ కోసం..
ఉదయాన్ని ఇలా ప్రారంభించండి.
ఉదయం లేవగానే టీ, కాపీ తాగొద్దు. లీట ర్ల కొద్దీ నీళ్లు వద్దు. కొంత సమయం ప్రాణాయా మం, ఎక్సర్సైజ్లు చేయాలి. నానబెట్టిన బాదం, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవి మెదడును రోజంతా ఉల్లాసంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. పొట్టుతో కూడిన పదార్థాలతో చేసిన ఆహారం తినాలి. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ ఉప్మా, బ్రౌన్బ్రెడ్, జొన్నరొట్టె వంటివి ఎంపిక చేసుకోవాలి. చెట్నీలో పల్లీలు, కొబ్బరి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. పాలు, పండ్లు తినడం మంచిది. పీచు పదార్థాలు, కెరోటిన్ వంటి ఇతర ఖనిజ లవణాలున్న వాటిని ఎకువగా తీసుకోవాలి. ఆపిల్ , నారింజ, క్యారెట్, బాదం వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.
లంచ్లో ఇవి ఉండేలా చూసుకోండి…
మధ్యాహ్నానికి కాస్త అలసటగా ఉంటుంది. శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. పచ్చి కూరగాయలతో భోజనం ప్రారంభించాలి. అన్నం, గోధుమ రొట్టెలతోపాటు ఐరన్,కార్బోహైడ్రేట్లు ఎకువగా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలి. కూరల్లో పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు తినా లి. వీటిలో ఏకాగ్రత పెంచడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. పెరుగు, మజ్జిగ తప్పనిసరి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారమే తినాలి.
రాత్రి వాటి జోలికి వెళ్లొద్దు…
రాత్రి తీసుకొనే ఆహారమే రేపటి మనల్ని నిర్దేశిస్తుంది. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిద్రపోవడానికి కనీసం రెండు, మూడు గంటల ముందే భోజనం చేసేయ్యాలి. గ్రిల్డ్ ఫిష్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనివల్ల తెల్లారే మెదడు ఉత్తేజంగా ఉంటుంది. పడుకొనే ముందు నానబెట్టిన బాదం, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. టీ, కాఫీ తాగకూడదు. పడుకునేటప్పుడు సెల్ఫోన్ జోలికి అసలే వెళ్లొద్దు.
భోజనాన్ని ఇలా విభజించుకోండి…
భోజనాన్ని నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. పచ్చి కూరగాయలు, ఉడకబెట్టిన కూరగాయలు, బ్రౌన్రైస్, పొట్టుతో ఉన్న పప్పులు ఇలా.. ప్లేట్లో నాలుగు సర్కిళ్లలో వేర్వేరుగా పెట్టుకోవాలి. దీనివల్ల నాలుగు సమానంగా తీసుకోవడం సులభమవుతుంది. ఫలితంగా శరీరానికి కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. నీరస పడకుండా రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. శరీరతత్వాలను బట్టి తగినంగా ఆహారం తీసుకోవచ్చు. లంచ్, డిన్నర్ ఏదైనా కాస్త వెలితిగానే ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఎక్కువగా తినేస్తే బద్దకంగా అనిపిస్తుంది. నిద్ర వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రశాంతతతో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.