హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఆర్అండ్బీ శాఖ పరిధిలోని రోడ్లకు రూ.6,959 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లకు మరో రూ.2 వేల కోట్లు.. మొత్తంగా రాష్ట్రంలోని రోడ్లకు రూ. 8,959 కోట్లు కేటాయించింది. ఇందు లో రోడ్ల నిర్వహణ కోసం రూ. 2,500 కోట్లు , కొత్త రోడ్ల నిర్మాణానికి రూ. 2,075 కోట్లు కేటాయించింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామాల్లోని రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేం ద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్ల కనెక్టివిటీని మరింత అభివృద్ధి చేసింది. రోడ్ల నిర్వహణపై రెండు నెలల క్రితం సమీక్షించిన సీఎం కేసీఆర్.. మరమ్మతుల కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం టెండర్ల దశ పూర్తికాగా, పనులు ప్రారంభించారు. రాష్ట్రంలోని పలుచోట్ల డబుల్ రోడ్లను ఫోర్, సిక్స్ లేన్లుగా నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.2,074.84 కోట్లు కేటాయించారు. సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫం డ్)కు రూ.486.85 కోట్లు, భవనాల నిర్మాణం కోసం రూ.100 కోట్లు.. మొత్తంగా కొత్త రోడ్లనిర్మాణం, రోడ్ల మరమ్మతులకే రూ. 4,575 కోట్లు కేటాయించడం విశేషం. సచివాలయ భవన నిర్మాణాలకు రూ.400 కోట్లు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుకు రూ.498 కోట్లు, ఆర్ఓబీ, ఆర్యూబీలకు రూ.400 కోట్లు, రీజినల్ రింగ్రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించింది.
పంచాయతీరాజ్ రోడ్లకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. రూ.2 వేల కోట్లు కేటాయించింది. వీటితో గ్రామీణ రోడ్లకు మహర్దశ రానున్నది. పంచాయతీరాజ్ శాఖ రోడ్ల చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి నిధులు కేటాయించడం ఇదే తొలిసారికావడం విశేషం.
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి వివరాలు