హైదరాబాద్, జూలై19 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి రివర్బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ సరిగా లేదని, లోపాలున్నాయని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకటగోపాల కృష్ణారావు మండిపడ్డారు. వివాదాలు లేని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడం దారుణమని, ఇది నీటి హక్కులను కాలరాయడమేనని దుయ్యబట్టారు. కేంద్రం ఇప్పటికైనా వివాదాల్లేని నీటి ప్రాజెక్టులను బోర్డుల పరిధి నుంచి తొలగించాలని, ఈ మేరకు ఏపీ సర్కారు వెంటనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని సమాఖ్య కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కేంద్రం జారీచేసిన గెజిట్పై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఏపీ, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, ఆర్డీఎస్, పులిచింతలను బోర్డు పరిధిలోకి తీసుకురావడం సమంజసమేనని, వివాదాలు లేని ప్రాజెక్టులను సైతం రివర్ బోర్డుల పరిధిలోకి తీసుకురావడం అన్యాయమని వాపోయారు. ఏపీకే పరిమితమైన ప్రకాశం, ధవళేశ్వరం, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, కల్వకుర్తి, నెట్టెంపాడు, తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టులను, ఏపీకి చెందిన తెలుగుగంగ తదితర ప్రాజెక్టులను కేంద్రం అధికారికంగా గుర్తించినా, అనుమతుల్లేని ప్రాజెక్టుల కింద గెజిట్లో ప్రకటించడం సరైంది కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతుల నీటి హక్కులకు అనుగుణంగా సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.