హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మండలాలు, జిల్లాలవారీగా వీఆర్ఏల వివరాలను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. 13 రకాల వివరాలను కోరుతూ ప్రత్యేక ఫార్మాట్ను జిల్లాలకు పంపించారు. కారుణ్య నియామకాల కోసం ‘మెడికల్ ఇన్ వ్యాలిడేషన్’ కోసం దరఖాస్తు చేసుకున్నవారు, వారి వారసుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. అర్హతలను బట్టి ఇతర శాఖల్లోకి తీసుకుంటామని, పేస్కేల్తోపాటు తదుపరి ప్రమోషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గురువారం హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రధానంగా వీఆర్ఏల వయసు, విద్యార్హత, కులం, వారు ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం పొందిన విధానం (డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా వారసత్వం), పదవీ విరమణ తేదీ తదితర వివరాలను సేకరిస్తున్నారు. వారిపై ఏమైనా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? వంటి సమాచారాన్ని కూడా సేకరించారు. పూర్తి సమాచారంతోపాటు విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల ప్రతులను శుక్రవారం మధ్యాహ్నంలోగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. వివరాలను సేకరించి, క్రోడీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలు, ఇతర రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన వీఆర్ఏల వివరాలను సేకరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 23,046 వీఆర్ఏలు ఉన్నట్టు అంచనా. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 2,783 మంది నియమితులయ్యారు. మిగతావారు వారసత్వంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ సమయంలోనే వీఆర్ఏల వివరాలు సేకరించారు. వీటి ప్రకారం సుమారు 3వేల మంది గ్రాడ్యుయేట్లు ఉన్న ట్టు తెలుస్తున్నది. 2,500 మంది వరకు ఇంటర్, సుమారు 4వేల మంది పదో తరగతి వరకు చదివినట్టు సమాచారం. ఏడు వేల మందికిపైగా పదిలోపు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మిగతావారికి ఎలాంటి విద్యార్హత లేదని అధికారులు తేల్చారు. వీరి విద్యార్హతల ఆధారంగా ఇతర శాఖల్లోకి తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు.
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పేస్కేలు వర్తింపజేయాలని వీఆర్ఏలు సు మారు రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వారి వేదనను మానవీయంగా అర్థం చేసుకొన్నారు. ముందుగా వారి వేతనాలను రూ.6 వేల నుంచి రూ.10,500కు పెంచారు. ఆ తర్వాత 2020లో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా.. పేస్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. అధికారులు విస్తృతంగా అధ్యయనం చేసి, వీఆర్ఏల వివరాలను సేకరించారు. విద్యార్హతలు, వయసు, వాటాబందీ వంటి అడ్డంకులు ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలో సమగ్రంగా అధ్యయనం జరిపారు. వీఆర్ఏల సంఘాలతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా) సైతం కీలకపాత్ర పోషించింది.