TS EAMCET | హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదల కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 నుంచి 30 తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు. ఈ సారి ఎంసెట్లో ఇంట ర్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకణ, ఫైనల్ కీ విడుదల, నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం ఫలితాలను విడుదల చేస్తామని జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు. ఐదురోజుల పాటు సజావుగా సాగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలు నిర్వహించగా, 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షలకు 94.11 శాతం విద్యార్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.
ఎంసెట్ పరీక్షల చివరిరోజైన ఆదివారం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో 95 శాతానికి పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. మొదటి సెషన్కు 33, 854 మంది అభ్యర్థులకు 32,281 మంది (95.35 శాతం), మధ్యాహ్నం పరీక్షకు 33,722 మందికి 32,156 (95.36శాతం) మంది హాజరైనట్టు ప్రకటించారు. ఆదివారం ఉదయం, సాయంత్రం ఒక్కొకటి చొప్పున మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి వివిధ కేంద్రాల్లో పరీక్షలను పర్యవేక్షించారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను సోమవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కోకన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి https://eamcet. tsche.ac. in వెబ్సైట్ నుంచి రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీలను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రాథమిక కీపై ఈ నెల 17న రాత్రి 8 గంటల వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పేర్కొన్నారు.