నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
కరీంనగర్లో టీఆర్ఎస్ మైనార్టీ నేతల నిరసన
కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 22: బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం హేయమని, గుజరాత్ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ద్వారా వినతిపత్రాలు పంపించారు. మైనార్టీ విభాగం నాయకు లు సోమవారం కరీంనగర్లో మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ నేత జమిలొద్దీన్ మాట్లాడారు. స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో గుజరాత్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా క్షమాభిక్షను ప్రసాదించడం దారుణమన్నారు. క్రూరమైన నేరస్తులను కాపాడడం ద్వారా సమాజానికి తప్పుడు సందేశమిస్తున్నారని మండిపడ్డారు. దోషులను తిరిగి అదుపులోకి తీసుకొని బతికున్నంత కాలం జైలుకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.