CM KCR | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అంటేనే సభల సమ్మోహనం… ఉప్పెనలా పోటెత్తే జనప్రభంజనం… జాతరలను తలపించే జనకోలాహలం. విపక్షాలపై ప్రశ్నల కొడవళ్లు విసిరి ప్రజలపై పన్నీటి జల్లు కురిపించే గులాబీ మేఘాలు బీఆర్ఎస్ సభలు. అది ఉద్యమ సందర్భమైనా, ప్రగతి నివేదన సన్నివేశమైనా బీఆర్ఎస్ బహిరంగ సభలది అదే తీరు. గులాబీ హోరు సృష్టిస్తున్న జనహోరుకు విపక్షాలు బేజారు కావాల్సిందే అని గులాబీ పార్టీ మరోసారి నిరూపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నిర్మల్లో, మంగళవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన బహిరంగసభలు ఉద్యమకాలం నాటి గర్జనలను తలపించాయి.
నాగర్కర్నూల్లో 100 ఎకరాల స్థలంలో నిర్వహించిన బహిరంగసభ ఎటు చూస్తే అటు జనం.. ఇసుకవేస్తే రాలనంత అశేష జనప్రవాహాన్ని చూసి గులాబీ దళపతి తెలంగాణ గుండెను ఆవిష్కరించారు. పచ్చబడుతున్న పాలమూరును చూసి పరవశించిపోయారు. గంజి కేంద్రాలు వెలసిచోట పంట కొనుగోలు కేంద్రాలు వచ్చినందుకు పొంగిపోయారు. వలసల జిల్లాగా ముద్రపడ్డ పాలమూరుకు పొరుగు రాష్ర్టాల నుంచి కూలీలొచ్చి పనిచేసే రోజులొచ్చినందుకు ఆనందపడ్డారు. మార్పు అంటే ఇదేనని ఆయన నిరూపించారు.
విపక్షాలపై ప్రత్యేకించి కాంగ్రెస్పై ‘చండ్ర’నిప్పులు చెరిగారు. ధరణి జోలికొస్తే భస్మీపటలం అయిపోతారని హెచ్చరించారు. నాగర్ కర్నూల్, నిర్మల్ ఈ రెండు సభల్లో రాష్ట్రంలో జరిగిన మార్పులను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఉద్యమకాలంలో ఊరూరా జల్లెడపట్టి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించిన నేపథ్యాన్ని సాధికారతతో సీఎం కేసీఆర్ వివరిస్తూ ప్రజలకు విపక్షాలు సృష్టిస్తున్న గందరగోళాన్ని పటాపంచలు చేస్తున్నారు. విపక్షాలకు ఏమీచేయాలో దిక్కుతోచని వాతావరణాన్ని సీఎం కేసీఆర్ సృష్టించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ మినహా మరెవ్వరూ అర్థం చేసుకోలేరని ప్రజలకు అర్థమయ్యేలా సభలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల సంవత్సరం కావటంతో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహానికి పదునుపెట్టింది. ఇంతకాలం విపక్షాలు ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ కుటుంబంపై ఎన్ని విమర్శలు చేసినా ‘అధికారంలో ఉన్నప్పుడు అన్నీ పట్టించుకోవాల్సిన పనిలేదు..ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అవసరం అయితే సందర్భం వచ్చినప్పుడు చెప్తాం’ అనే వైఖరిని అనుసరించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపి, రాష్ర్టాన్ని సాధించి, సాధించిన రాష్ర్టాన్ని రంగాల్లో అజేయశక్తిగా నిలిపిన సీఎం కేసీఆర్ విపక్షాల దుష్టపన్నాగంపై ఉపేక్ష అవసరం లేదని నిర్ణయించినట్టు నిర్మల్, నాగర్కర్నూల్ సభలు తేల్చిచెప్పాయి. ఒకవైపు 9 ఏండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అని ప్రజలకు విడమరచి చెప్పటం, మరోవైపు అకారణంగా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా అంతే ధాటిగా ఎదర్కోవటం అనే ద్విముఖ వ్యూహం ఈ రెండు సభల్లో ఆవిష్కృతమైంది.
కర్ణాటకలో నాట్లు వేస్తే తెలంగాణలో పంట పండుతుందని కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నది. కానీ, ఎంతచేసినా తెలంగాణలో కాంగ్రెస్ పేలని తారాజువ్వేనని ఇటీవల ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ హాత్ సే హాత్జోడో యాత్రకు రాష్ట్రంలో ప్రజల నుంచి అంతగా స్పందన లేదు. వీటికితోడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తుపోకడలు ఆ పార్టీని కకావికలం చేస్తున్నవి. ధరణి పోర్టల్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి. ‘అసలే కేసీఆర్ను ఎదుర్కోవటం ఎట్లా? అని కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతుంటే.. ధరణిని రద్దు చేస్తామని రేవంత్ వ్యాఖ్యానించటం కాంగ్రెస్ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ‘కాంగ్రెస్ రాజ్యం లో దళారీలదే రాజ్యం’ అంటూ సీఎం కాంగ్రెస్ గత చరిత్రను ప్రజల ముందు ఆవిష్కరించారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ మాయమాటలను నమ్మేస్థితిలోలేరని నిర్మల్, నాగర్ కర్నూల్ బహిరంగ సభలు తేల్చిచెప్పాయి.
సీఎం కేసీఆర్ వ్యూహానికి బీజేపీ బిత్తరపోతున్నది. రాష్ట్రంలోని యువత బీఆర్ఎస్తో లేరు అని బీజేపీ భావించి బొక్కబోర్లా పడింది. బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల్లో సింహభాగం యువతదే కావటంతో కమలం శ్రేణుల్లో గుబులు మొదలైంది. నిర్మల్, నాగర్కర్నూల్ బహిరంగసభలకు బీఆర్ఎస్ అంత దృష్టిసారించలేకపోయినా లక్షలాది జనం తరలి వస్తున్న వైనంపై బీజేపీకి పాలుపోవటం లేదు. ప్రధాని మోదీ హైదరాబాద్లో హాజరైన రెండు సభలకు వాహనాలు పెట్టి తరలించినా 10 నుంచి 15 వేలకు మించి జనం రాని పరిస్థితి. అమిత్ షా సభలు సకాలంలో జనం రాక ఆలస్యంగా మొదలై అరకొరగా ముగిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ను ఢీకొట్టే అవకాశమే లేదని నిర్మల్, నాగర్కర్నూల్ సభలు స్పష్టం చేశాయి.