హైదరాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ): ఎఫ్ఆర్బీఎం (ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) పరిమితికి లోబడే తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసినట్టు భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్) తన 2020-21 వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీలో) 25 శాతానికి మించి అప్పు చేయకూడదన్నది ఎఫ్ఆర్బీఎం నిబంధన. జీఎస్డీపీ ఆధారంగానే దేశ, లేదా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు. రుణాలు ఇవ్వాలన్నా, ఆ దేశాల్లో లేదా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, ఆర్థికంగా ఎలా ఉన్నారని విశ్లేషించడానికి ఇదే కొలమానంగా చూస్తారు. ఈ విషయంలో తెలంగాణ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ఈ నిబంధనకు లోబడి ఉన్న రాష్ర్టాలకు అదనంగా మరి కొంత అప్పు చేయడానికి ఎఫ్ఆర్బిఎం చట్టం వెసులుబాటు కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలుగా సగటున రాష్ట్రం చేసిన అప్పు 23.5 శాతం మాత్రమే కాగా ఎప్ఆర్బిఎం పరిమితి మేరకు 25 శాతం వరకు అప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం వినియోగించుకోలేదని కాగ్ తన నివేదికలో చెప్పింది. కాగ్ తన నివేదికలోని ఆస్తులు-అప్పులు అధ్యయంలో ఈ విషయాన్ని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయిందంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేసే విమర్శలలో వీసమెత్తు వాస్తవం లేదని, ఈ పార్టీల పాలిత రాష్ర్టాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు చేసిన విషయాన్ని సామాజిక-ఆర్థిక సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం రూ.1,21,236 కోట్ల అప్పు కలిగి ఉండగా, 2016-17లో మరో రూ.13,502 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇది రూ.1,34,738 కోట్లకు చేరగా ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 21 శాతం. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రం సగటున చేసిన అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితి 25 శాతానికి మించి చేయలేదని తేల్చింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు అదుపులోనే ఉన్నట్టు కాగ్ ప్రశంసించింది.
తెలంగాణ అభివృద్ధి వ్యయం ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ: కాగ్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వ్యయం (ఆర్థిక, సామాజిక రంగాలపై చేసింది) ఇతర రాష్ర్టాల సగటు కంటే ఎక్కువని భారత కంప్ట్రోలర్ మురియు ఆడిటర్ జనరల్ (కాగ్) తన వార్షిక నివేదికలో పేర్కొన్నది. అభివృద్ధి వ్యయానికి తెలంగాణ అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తమ పరిశీలనలో వెల్లడైనట్టు తెలిపింది. ఇతర రాష్ర్టాల కంటే అభివృద్ధి వ్యయంలో తెలంగాణ ముందున్నదని ప్రశంసించింది.
స్థానిక సంస్థలకు పెద్దపీట
స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గడిచిన ఐదేండ్లకాలంలో భారీ స్థాయిలో నిధులను కేటాయింపులు జరిపినట్లు తాజాగా కాగ్ తన 2020-21 వార్షిక నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు మొత్తంగా రూ.30,648 కోట్ల నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం..గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.54,284 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో నిధుల కేటాయింపుల్లో 21 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. పల్లె ప్రగతి (2019), పట్టణ ప్రగతి (2020) వంటి బృహత్ కార్యక్రమాలు చేపట్టడంతో భారీగా నిధులు కేటాయించాల్సి వచ్చిందని కాగ్ తన వార్షిక నివేదికలో స్పష్టంచేసింది.
కొవిడ్తో తగ్గిన రాబడి.. పెరిగిన ఖర్చులు
కరోనా సంక్షోభం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ద్వంద్వ ప్రభావం చూపినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో విశ్లేషించింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ రాబడి తగ్గినట్టు, ఖర్చులు పెరిగినట్టు గుర్తించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల)పై ఆధారపడాల్సి వచ్చినట్టు తెలిపింది. అయినప్పటికీ 2020-21లో తెలంగాణ 2.42% సానుకూల వృద్ధిరేటును నమోదు చేయడం ముదావహమని పేర్కొన్నది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును మార్కెట్ రుణాల ద్వారా పూరించాల్సి రావడంతో చేబదుళ్లపై ఆధారపడక తప్పలేదని కాగ్ అభిప్రాయపడింది.