హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని బాచుపల్లిలోని నూతన క్యాంపస్ భవనానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో విభాగాన్ని దశలవారీగా వర్సిటీ అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే గ్రంథాలయ తరలింపు ప్రక్రియ తుది దశకు చేరింది. ఇదే బాటలో మిగతా విభాగాలను తరలించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఎంఏ, పీజీ కోర్సులను బాచుపల్లిలో నిర్వహించనుండగా, సాయంకాల కోర్సులను నాంపల్లిలోని ప్రస్తుత క్యాంపస్లోనే కొనసాగించనున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి బాచుపల్లిలో నూతన క్యాంపస్ నిర్మాణానికి 2002లోనే 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే సీఎం కేసీఆర్ను ఆహ్వానించి నూతన క్యాంపస్ను ప్రారంభించాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వర్సిటీ అధికారులు కలిసి చర్చించనున్నారు.