హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఉనికి కూడా లేదని మునుగోడు ఉప ఎన్నికతో తేలిపోయింది. పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రూపొందించిన సిద్ధాంతాలను వదిలేసి బీజేపీ ట్యూన్లో సాగుతున్న ఆ పార్టీని మునుగోడు ఓటర్లు కనీసం పట్టించుకోలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాజీపడి బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ఉత్తరప్రదేశ్లో పార్టీని నామరూపాల్లేకుండా చేశారు. అదే బాటలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ముందుకు సాగుతున్నారని బహుజన నేతలు మొదటి నుంచీ విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీకి బీటీమ్గా తెలంగాణ బీఎస్పీ వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. మునుగోడులో బీఎస్పీ చేసిన హడావిడి చూసి అందరూ నివ్వెరపోయారు. క్యాడరే లేని చోట ఎందుకు ఇదంతా? అని ముక్కున వేలేసుకొన్నారు. ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే బరిలో నిలిచిందనే అనుమానాలు వ్యక్తంచేశారు. అందుకు బలం చేకూరుస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 వేల మంది స్వేరో కార్యకర్తలను ప్రవీణ్కుమార్ మునుగోడులో మోహరించారు. దాదాపు 7 శాతం, అంటే 20 వేల నుంచి 30 వేల పైచిలుకు ఓట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకొన్నారు. ఒక దశలో బీఎస్పీ అభ్యర్థే మూడో స్థానంలో ఉంటాడని ప్రచారం చేసుకొన్నారు. కానీ బీఎస్పీ అభ్యర్థికి 4,146 ఓట్లే వచ్చాయి.