Irrigation ENC | హైదరాబాద్, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్శాఖ ఈఎన్సీ ఎవరు? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆయన రాజీనామా తర్వాత శనివారం సాయంత్రం వరకు ప్రభుత్వం ఎవరినీ ఆ స్థానంలో నియమించలేదు. 2013లో ఈఎన్సీగా విరమణ పొందిన మురళీధర్ను ఉమ్మడి ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయననే కొనసాగించింది.
ప్రస్తుతం ఇరిగేషన్శాఖలో అడ్మినిస్ట్రేషన్ ఈ ఎన్సీ అనిల్కుమార్, ఆపరేషన్స్ అండ్ మె యింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్రావు, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ వంటి సీనియర్లు ఉన్నారు. నాగేందర్రావుకు ఇప్పటికే ఇరిగేషన్శాఖలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. మచ్చలేని అధికారిగా పేరు సంపాదించుకున్నారు. అనిల్కుమార్కు ఫీల్డ్ అనుభవం ఎక్కువ. ఆయన నేతృత్వంలోనే మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. హరిరామ్కు సైతం ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభముంది.
వీరితో పాటు తాజాగా ఈఎన్సీ రేసులోకి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బంధువు, మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి పేరు వచ్చి చేరింది. ప్రభుత్వం మాత్రం ఈఎన్సీ అనిల్కుమార్ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అపారమైన అనుభవం ఉన్నప్పటికీ ఈఎన్సీ నాగేందర్రావు వచ్చే మేనెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. శ్రీనివాస్రెడ్డి ఏప్రిల్లో విరమణ పొందాల్సి ఉంది. మిగిలిన ఇద్దరిలో అనిల్కుమార్కు మరో 20 నెలలు, హరిరామ్కు మూడేళ్ల సర్వీస్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనిల్కుమార్వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది.
ఇరిగేషన్శాఖను గత ప్రభుత్వం 2020లో పునర్వ్యవస్థీకరించి 19 టెరిటోరియళ్లుగా విభజించింది. మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులన్నీ ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చి ఆయా టెరిటోరియల్ బాధ్యతలను చీఫ్ ఇంజినీర్లకే అప్పగించింది. అన్ని విభాగాలపై పూర్తిస్థాయి నిర్ణయాధికారాన్ని ఈఎన్సీ జనరల్కు అప్పగించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలకాలని చూస్తున్నట్టు సమాచారం. ఈఎన్సీ జనరల్కు పూర్తిస్థాయి అధికారాలు అప్పగించకుండా ఈఎన్సీలందరికీ సమాన బాధ్యతలు, అధికారాలు పంచాలని చూస్తున్నట్టు తెలిసింది.