హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్శాఖ సంసిద్ధమైంది. రాష్ట్రంలోని 60 వేలకుపైగా సిబ్బందికితోడు మరో 20 వేల మంది స్పెషల్ ఫోర్స్తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
తెలంగాణలో 2018 ఎన్నికలకు సరిహద్దు రాష్ర్టాల నుంచి 18 వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు తీసుకున్నారు. ఈ సారి ఆ సంఖ్యను 20 వేలకు పెంచినట్టు తెలిసింది. కేంద్రం నుంచి 280 కంపెనీలు అప్పుడు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 300కు పెంచినట్టు సమాచారం. తెలంగాణ పోలీస్ ఫోర్స్సహా కేంద్ర బలగాలను రాష్ట్రంలో ఎక్కడెక్కడ.. ఎంత మందిని దించాలో ఇప్పటికే నిర్ణయించిన పోలీసుశాఖ.. మంగళవారం నుంచి ఫోర్స్ను డిప్లాయ్ చేయనున్నది.
చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలు
ఎన్నికల వేళ డబ్బు, మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్ వంటివి తరలించే ముఠాలపై పోలీసులు, ఎక్సైజ్శాఖ అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టారు. 89 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిల్లో 24 గంటలు పనిచేసేలా సీసీ కెమెరాలను బిగించారు. వాటిని హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. నేరస్తుల సమాచార మార్పిడికి రెండుశాఖల అధికారులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు. ఇప్పటికే అన్ని మండలాల సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేశారు.
రాష్ట్ర సరిహద్దుల్లో 21 చెక్పోస్టులతో 24 గంటలూ ఎక్సైజ్శాఖ తనిఖీలు చేపడుతున్నది. తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లలో సైతం తనిఖీ నిర్వహణకు ఎక్సైజ్శాఖ 13 ప్రత్యేక బృందాలను నియమించింది. నాలుగు బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను కూడా రంగంలోకి దించింది. రాష్ట్రంలోని అన్ని బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంలో తనిఖీలకు స్థానిక సిబ్బందికి పోలీస్, ఎక్సైజ్శాఖలు బాధ్యతలు అప్పగించాయి.