నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13న నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్పల్లి-అద్దంకి రహదారికి అనుకుని ఉన్న 50 ఎకరాల స్థలంలో సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే చదును చేసే పనులు పూర్తయ్యాయి.
శనివారం నుంచి సభా వేదిక, గ్యాలరీల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సామగ్రి శనివారం అక్కడికి చేరుకోనున్నది. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, క్రాంతికిరణ్, జాజాల సురేందర్, మాజీ మేయర్ రవీందర్సింగ్ తదితరులు శుక్రవారం సభా స్థలాన్ని పరిశీలించారు. వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, ఇతర పనులపై చర్చించారు. మంగళవారం సభ ఉండటంతో సోమవారం సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయనున్నట్టు తెలిపారు. సభా వేదికకు నలువైపులా పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించి తగు సూచనలు చేశారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల జరిగే నష్టం, దాని పర్యవసానాలపై ఏర్పాటుచేస్తున్న ఈ బహిరంగ సభకు విస్తృత ప్రచారం కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రంగంలోకి దిగింది. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా పలు నియోజకవర్గాల్లో మండలాల వారీగా సమావేశాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలతోపాటు సభ కోసం నియమించిన పార్టీ సమన్వయకర్తలు సైతం రంగంలోకి దిగారు. చలో నల్లగొండ బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరిస్తూనే పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి వరకు వెళ్లేలా సమాయత్తం చేస్తున్నారు.
చలో నల్లగొండ బహిరంగ సభను ప్రకటించగానే నల్లగొండ జిల్లాలో 30,30(ఏ) పోలీస్ యాక్ట్ను అమలులోకి తెస్తున్నట్టు చేసిన ప్రకటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సభకు అనుమతిస్తారా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నెల 7న మధ్యాహ్నం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ ఎస్పీ చందనాదీప్తిని కలిసి సభకు అనుమతి కోరుతూ లేఖ అందజేశారు. ఈ నేపథ్యంలో సభకు పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ నెల 13 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభకు అనుమతి ఇస్తున్నట్టు నల్లగొండ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.