హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండిం గ్ చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీ ఈ నెల 31తో ముగుస్తుందని, మరోసారి తేదీ పొడిగించే అవకాశం లేదని పోలీసుశాఖ స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకుగాను ఇప్పటివరకు 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 27 నుంచి పెండింగ్ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం తొ లుత 15 రోజులు అవకాశం కల్పించింది. సాంకేతిక సమస్యల కారణంగా మరోసారి జనవరి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో బీఈడీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నిరుడు జూలై 14న ఎడ్సెట్ ఫలితాలు విడుదలవగా, నెలలు గడిచినా కౌన్సెలింగ్ మాత్రం నిర్వహించలేదు. దీంతో బీఈడీ కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో విచారించిన హైకోర్టు వెంటనే బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్రంలో 411 బీఈడీ కాలేజీలు ఉండగా, 34 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.