Secretariat | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సిటీ పోలీస్ కమిషనరేట్, టీఎస్ఎస్పీ సమన్వయంతో భద్రతా పరమైనచర్యలు తీసుకున్నారు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ప్రారంభం సందర్భంగా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. నగర ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండాప్రత్యేకంగా వంద మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నారు.
సచివాలయం లోపల ప్రత్యేకంగా భద్రతను కల్పించేందుకు సుశిక్షితులైన వందమందిని నియమించినట్టు చెప్పారు. సిటీ పోలీస్ విభాగం నుంచి 50 మంది, రాచకొండ నుంచి 25 మంది, సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 25 మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. వీరితో పాటుగా అదనంగా సిటీ పోలీస్ నుంచి 50 మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. కేవలం లా అండ్ ఆర్డర్ నుంచే సుమారు 800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని అన్నారు. సచివాలయంలో లోపల 300 సీసీ కెమెరాలతో పాటు టీఎస్ఎస్పీ, ఆక్టోపస్, ఇతర ఫోర్సుల నుంచి నియమించిన సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు.
సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహరా కాయనున్నారు. రాత్రీ పగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా వారి సమాచారం ఆధార్ డాటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డాటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేశారు.
నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. ప్రారంభోత్సవ నేపథ్యంలో నెలకొనే రద్దీ పరిస్థితుల దృష్ట్యా సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా లుంబిని పార్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోలను మూసి వేస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని నగరవాసులు గుర్తించి, ఆయా పార్కుల వైపు రాకపోకలు సాగించకుండా వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించింది.