హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను నట్టేట ముంచుతున్న అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నది. నకిలీ విత్తనాలు అమ్మి, రైతుల పంట నష్టాలకు కారకులైన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దుకాణాల వద్దే ప్రత్యేక తనిఖీలు చేపట్టి.. అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకొంటున్నారు.
2014 నుంచి 2022 వరకు నకిలీ విత్తనాలు అమ్మిన 1,932 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద 991 కేసులు నమోదు చేశారు. పదే పదే అక్రమాలకు పాల్పడే దుకాణ యజమానులపై 58 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు.