హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): దక్షిణ కొరియాలోని యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ‘బిగ్ వో షో’ మ్యూజికల్ ఫౌంటెయిన్ తరహా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రుల బృందం పేర్కొన్నది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్ బృందం శనివారం ‘బిగ్ వో షో’ను పరిశీలించింది. దాని పనితీరు, సాంకేతికతను అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్లో, మహబూబ్నగర్లో ఇలాంటి ఆధునిక ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.