హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): నీళ్లలో, వరదల్లో పౌరులను కాపాడటంపై రాష్ర్టానికి చెందిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన సిబ్బంది శిక్షణ పొందుతున్నారు. ఇండియన్ ఫైర్ రెస్క్యూ నుంచి నిష్ణాతులైన అధికారులతో హైదరాబాద్లోని దుర్గం చెరువులో 16 రోజులు శిక్షణా శిబిరం కొనసాగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో తొలిసారిగా 150 మంది సిబ్బందిని అగ్నిమాపకశాఖ నుంచి ఎంపిక చేసి, ఎస్డీఆర్ఎఫ్గా ఏర్పాటు చేశారు. వీరిలో కెమికల్ బ్లాస్ట్ల నుంచి ప్రజలను కాపాడేందుకు కొందరు, అగ్నిప్రమాదాల వేళ పెద్ద భవనాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మరికొందరు.. ప్రత్యేకించి వరదలు, వర్షాకాలంలో పౌరులను కాపాడేందుకు కొందరిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు.
దుర్గం చెరువులో 73 మంది సిబ్బందికి రోజూ శిక్షణ ఇప్పిస్తున్నారు. నీళ్లలో ఆక్సిజన్ పెట్టుకొని ఈత కొట్టడం, నీటిలో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో రక్షించడం, ఇతర బోట్ డ్రిల్స్పై ఇండియన్ ఫైర్ రెస్క్యూ సిబ్బంది శిక్షణ ఇస్తున్నారు. వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేయాలనేది తమ లక్ష్యమని అగ్నిమాపక డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. అగ్నిమాపకశాఖ సిద్ధం చేసిన ఈ మూడు దళాల్లో ఒక్కోదాంట్లో 50 మందికి తగ్గకుండా ఉంటారు.