హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 21 (నమస్తే తెలంగాణ): పల్లెల్లో చెరువులు వ్యవసాయానికే కాదు.. తాగునీరు మొదలు ప్రజల బతుకుదెరువు వరకు ముడిపడి ఉంటాయి. అలాంటి ఒక చెరువును రియల్టర్లు చెరబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం లక్షలు వెచ్చించి బలోపేతం చేసిన ఫీడర్ చానల్, కాల్వలు, చెరువు కట్టను ధ్వంసం చేశారు. చుక్క నీరు రాకుండా అడ్డుకట్టలు కట్టి దాని గొంతు నులిమారు. మొదట్లో గ్రామస్థులు పెద్దగా స్పందించలేదు. కానీ కాలక్రమేణా ఆ చెరువు ఎండిపోవటంతో వంద ఎకరాల ఆయకట్టు పడావు పడింది.
దిగువన ఉన్న గొలుసు కట్టు చెరువుల ఉనికి సైతం ప్రశ్నార్థకమైంది. రానురానూ భూగర్భజలాలూ పడిపోతుండటంతో గ్రామస్థులంతా మేల్కొని చెరువును పరిరక్షించుకునేందుకు నడుం బిగించారు. కొన్ని రోజులుగా పలు శాఖల అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇదీ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లికి ఆదరువైన రంగ సముద్రం కన్నీటి గాథ. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ చెరువు ఇప్పుడు రియల్ బకాసురుల వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నది.
గిరికొత్తపల్లి గ్రామం చెరువులకు నిలయం. కాకతీయుల కాలంలో గ్రామం చుట్టూ రంగసముద్రం, మాలకుంట, పీర్లకుంట, చాకలివానికుంట, కుమ్మరికుంట, తుమ్మలకుంట, రైరాకులం చెరువు, మారంచెరువుల నిర్మాణం జరిగింది. ఊరు ఎగువన ఉన్న వాగు నుంచి వరద చెరువుల్లోకి మళ్లేందుకు కత్వ ఉన్నది. కత్వ నుంచి వచ్చే వరద ఒకవైపు రంగసముద్రం, మరోవైపు పీర్ల చెరువులోకి మళ్లుతాయి. రంగ సముద్రం మత్తడి పారి చాకలివాని కుంట, అటు నుంచి కుమ్మరికుంట నిండుతాయి. పీర్ల చెరువులోకి వచ్చిన నీళ్లు మత్తడి దుంకి రైరాకులం చెరువు అటు నుంచి మిగతా చెరువుల్లోకి వెళతాయి. ఇన్ని చెరువులకు ఆదరువు ఉన్నందున పెద్ద వాగు నుంచి నీళ్లు వచ్చేందకు 1971లోనే పటిష్టమైన కత్వను నిర్మించారు.
ఆ తర్వాత చెరువులను పట్టించుకునే వారు లేకున్నా, ఏటా వాగు నుంచి వచ్చే వరదతో చెరువులన్నింటిలో జలకళ ఉట్టిపడేది. అన్ని చెరువుల కింద దాదాపు 400 ఎకరాల వరకు భూమి సాగవుతున్నది. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ చెరువులన్నింటినీ సర్వే చేసి, ఐడీ నంబర్లు కేటాయించి, జియో ట్యాగ్ చేపట్టారు. రంగసముద్రం చెరువును మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. మిషన్ కాకతీయ కింద రూ.18 లక్షలతో ఫీడర్ చానల్స్ను పటిష్టం చేసి, పూడికతీత చేపట్టింది.
సాధారణంగా చెరువుల్లోనూ శిఖం పట్టాలు ఉంటాయి. యజమానులు అందులో వ్యవసాయం చేసుకోవటం మినహా ఎలాంటి నిర్మాణాలు, వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టరాదు. చెరువుల్లోకి నీళ్లు వచ్చే మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరాదు. ధ్వంసం చేయరాదు. కానీ కొందరు రియల్టర్లు రంగ సముద్రం చెరువుకు మరణ శాసనం రాశారు. వాగు నుంచి చెరువుల వైపు వరద మళ్లే కత్వ, ఫీడర్ చానల్స్ ఇలా అన్నింటినీ ధ్వంసం చేశారు. వాగుల్లోకి వరద రాకుండా కట్టలు వేశారు. నాలుగేండ్ల కిందట ఇలాగే ధ్వంసం చేస్తే గ్రామస్థుల ఫిర్యాదుతో అధికారులు వాటిని తిరిగి పునరుద్ధరించారు. ఇప్పుడు మళ్లీ వాటిని ధ్వంసం చేశారు. దీంతో ఈ సంవత్సరం రంగసముద్రంలోకి చుక్క వరద నీరు రాకపోగా, చుట్టూ ఉన్న చెరువులు ఒట్టిపోయాయి. దీంతో తేరుకున్న ప్రజలు ఏకతాటిపైకి వచ్చారు. ఆ మధ్య కొందరు యువకులు చెరువును కాపాడేందుకు నీటిపారుదల, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికారులు నెలల తరబడి వారిని తిప్పుకున్నారే తప్ప చర్యలు తీసుకోలేదు. దీంతో బోర్లలో నీళ్లు తగ్గి ఆయకట్టు ప్రమాదంలో పడింది. అప్పుడుగానీ రైతులకు తెలిసి రాలేదు. చివరకు కొద్దికాలం కిందట గిరికొత్తపల్లి రైతు సంక్షేమ సంఘం ఏర్పాటై పలు శాఖల అధికారులకు అదేపనిగా ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఎట్టకేలకు ఈ నెల 4న నీటిపారుదల శాఖ అధికారులు మాడ్గుల ఎమ్మార్వోకు లేఖ రాశారు. రంగ సముద్రం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు ధ్వంసం చేశారని, చెరువులోకి రావాల్సిన సహజసిద్ధమైన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు నిర్మాణాలు చేపట్టారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు లేవు. దీంతో శుక్రవారం గ్రామ సర్పంచ్ పద్మ, రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులు మాడ్గుల తహసీల్దార్, ఎంపీడీవో, నీటిపారుదల శాఖ అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. చెరువులను పునరుద్ధరించి, గ్రామాన్ని కాపాడాలని కోరారు.
గ్రామస్థులు చెరువును పరిరక్షించుకునేందుకు తండ్లాడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం సరైన రీతిలో స్పందించటం లేదనే విమర్శలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ-రెవిన్యూశాఖ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకొని కాలయాపన చేయటం పరిపాటిగా మారడం రియల్టర్లకు వరంగా మారింది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో, తహసీల్దార్, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి సర్వే నిర్వహించి, హడావిడి చేశారు. ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు. ఇప్పటికీ రైతులు పదేపదే ఫిర్యాదు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
వందల ఏండ్ల చరిత్ర కలిగిన గిరికొత్తపల్లి చెరువులను కాపాడాలి. చెరువులను చెరపట్టడం వల్ల ప్రజల జీవనాధారంపై ప్రభావం పడుతున్నది. చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. చెరువు కట్టలను, తూములను, కత్వలను ధ్వంసంచేసిన వారిపై చర్యలు తీసుకుని, చెరువును పునరుద్ధరించాలి.
– గొలల కొండ శ్రీను, రైతు సంఘం నాయకుడు
గిరికొత్తపల్లిలో ఉన్న రంగ సముద్రం చెరు వు ఊరికి గుండెకాయ లాంటిది. ఆ చెరువు పోతే మా ఊరికి గుండె పగిలినట్టే. రైతులు గోస పడుతున్నారు. వాగు నుంచి వచ్చే నీళ్లు వృథాగా పోతున్నాయి. చెరువు లేకపోతే గ్రామ ప్రజలు వలసలు పోవాల్సిందే.
– గోరటి కృష్ణయ్య, గ్రామ రైతు