హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని, వాటిని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించబోనని స్పష్టం చేశారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని, ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఈ మేరకు అర్వింద్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని అన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సామెతల్లో భాగమేనని అనడం సరికాదని తెలిపారు. తెలంగాణలో చాలా సామెతలు ఉంటాయని, కానీ వాటిని జాగ్రత్తగా, సున్నితంగా సందర్భాన్ని బట్టి వాడాలని సూచించారు.
ప్రెస్మీట్ సందర్భంగా బండి సంజయ్పై అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు అంటే అదేదో గొప్పదేమీ కాదు అని అన్నారు ‘రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదు. కో-ఆర్డినేషన్ సెంటర్ మాత్రమే’ అని అన్నారు. అర్వింద్ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడినట్టు అయ్యింది. ఇప్పటికే పార్టీలో బండి సంజయ్, అర్వింద్కు మధ్య పొసగడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఎవరికి వారు ప్రత్యేకంగా గ్రూపులను మెయింటేన్ చేస్తూ బల ప్రదర్శనకు దిగుతున్నారన్న ప్రచారం ఉన్నది. పార్టీ కోసం తామంతా కష్టపడుతుంటే అధిష్ఠానం వద్ద ఆ క్రెడిట్ మొత్తం బండి సంజయ్ కొట్టేస్తున్నారనే ఆగ్రహంతో ఇతర నేతలు ఉన్నట్టు తెలిసింది.