హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్రి’ అధికారాలపైనే గురి పెట్టారని చెప్తున్నారు. బీజేపీ, ఆరెస్సెస్ మధ్య సమన్వయకర్తను ‘మంత్రి’ అని పిలుస్తుంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి, మంత్రికి దాదాపు సమాన అధికారాలు ఉంటాయి. అధిష్ఠానం దృష్టిలో మంత్రి స్థానానికే విలువ ఎక్కువ. గతంలో ఈ పదవిలో మంత్రి శ్రీనివాసులు ఉండేవారు. బండి సంజయ్ వ్యవహార శైలిపై మంత్రి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేవారు. దీంతో బండి సంజయ్ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ ద్వారా మంత్రి శ్రీనివాసులును బదిలీ చేయించారనే వాదనలు ఉన్నాయి.
ఆ తర్వాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో అందరికీ బండి సంజయ్ ఇప్పుడు బాస్ అయ్యారు. ‘మంత్రి’ అధికారాలనూ పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకొని, తద్వారా ఆరెస్సెస్పై, బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై పట్టు సాధించాలని బండి భావిస్తున్నట్టు తెలిసింది. మంత్రి స్థానంలోకి కొత్తగా ఎవరూ రారని, కాబట్టి ప్రతి ఒక్కరూ తన మాటే వినాలని హుకుం జారీ చేశారట. కార్యాలయంలోని ఒక్కో విభాగానికి తన మనషులను పంపి, సమీక్షలు చేయిస్తున్నారని తెలిసింది. దీంతో.. ఆరెస్సెస్, బీజేపీ మధ్య సమన్వయం కొరవడుతున్నదని, ఎక్కడ చూసినా బండి సంజయ్ మనుషులే నిండిపోతున్నారని పార్టీ నేతలు వాపోతున్నారు. మరోవైపు వ్యక్తి భజన పెరిగిందని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.