హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తమ బిడ్డకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన దంపతులు 2013లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి పేరు జనగాం సురేశ్. తల్లి పేరు అనిత. వీరు దళిత (మాల) సామజిక వర్గానికి చెందినవారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకొన్నారు.
ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నది. తాత్కాలికంగా ఆ అమ్మాయిని చిట్టి అనే పేరుతో ఆధార్ కార్డు తీశారు. అదే తాత్కాలిక పేరుతో స్కూల్లో చదువుతున్నది. ఇంకా పేరు పెట్టలేదని విషయం తెలిసిన స్థానికులు, బంధువులు.. ఆ అమ్మాయిని ‘కేసీఆర్’ అని పిలుస్తారు. కొంతమంది స్వీటీ అని, వారికి తోచిన పేర్లతో పిలుస్తారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి చొరవ తీసుకొని, తల్లిదండ్రులను, బిడ్డను ఆదివారం ప్రగతిభవన్కు తోడొని వచ్చారు.
విషయం తెలుసుకొన్న ముఖ్య మంత్రి కేసీఆర్-శోభ దంపతులు, సురేశ్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు ‘మహతి’ అని నామకరణంచేశారు. సంప్రదాయ పద్ధతిలో బట్టలు పెట్టి ఆథిత్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో తమను సీఎం కేసీఆర్ ఆదరించి దీవించిన తీరుకు, సురేశ్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయింది. సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలిపింది.