రాజన్న సిరిసిల్ల, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ కార్నర్ మీటింగ్లో ఆ పార్టీ నేతలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కార్నర్ మీటింగ్లో బీజేపీనే కార్నర్ చేసి కన్ఫ్యూజన్లో పడేసింది ఓ వృద్ధురాలు. సిరిసిల్లలోని ఇందిరానగర్ హనుమాన్ టెంపుల్ వద్ద రెండు రోజుల క్రితం బీజేపీ నేతలు కార్నర్ మీటింగ్ పెట్టారు. అందులో బీజేపీ పట్టణాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ సర్కారు ఇచ్చే రెండువేల పింఛన్తో ఎల్తుందా? ఆ రెండువేలను చూసే ఓటేసుకుంట బోతే ఎట్లా? అని ప్రశ్నించారు. దీనికి మహబూబి అనే వృద్ధురాలు దీటైన సమాధానం ఇచ్చింది.
‘కొడుకా ఓ ముచ్చట జెపుతా.. కన్న కొడుకే ఒక్క రూపాయి ఇయ్యిమంటే ఇయ్యడు. ఆయనన్న రెండు వేలు పంపుతున్నడు. సంతోషంగా ఉన్నం. కొడుకులే ఇత్తలేరు. ఆయనన్న ఇత్తుండుగా’.. నాకు ఇద్దరు కొడుకులున్నరు. ఆళ్ల పరిస్థితి మంచిగలేదు. నాపెనిమిటి పదిహేనేండ్ల కింద చనిపోయిండు. ముసలితనంలో కేసీఆర్ సార్ ఇత్తున్న రెండువేల పింఛను పైసలతో బతుకుతున్న. మీరేమి ఇస్తున్రు’ అంటూ నిలదీసింది.
ఆమె మాటలకు బీజేపీ నాయకులు తెల్లబోయారు. ఏం మాట్లాడాలో తెలియక బిక్కముఖం వేసి సైలెంట్ అయి పోయారు. సరైన సమాధానం చెప్పలేక మాయమాటలతో నమ్మించే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ల మాటలకు అడ్డుపడుతూ కేసీఆర్ సార్ జెయ్యబట్టే మాబిడ్డల పెండ్లిళ్లు అయితున్నయంటూ చెప్పుకొచ్చింది. అసలే మీటింగ్కు జనం రాక అసంతృప్తితో ఉన్న నాయకులకు మహబూబీ కురిపించిన ప్రశ్నలతో వెనుదిరిగాల్సి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారి జోరుగా చర్చ నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.