DGP Anjani Kumar | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మరణం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, సమస్యను ఆహ్వానించి దానిని సమర్థంగా పరిష్కరించినప్పుడే మనిషి మరింతగా రాటుదేలుతాడని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా హాన్స్ సంస్థ ఆదివారం మారథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. కష్టసుఖాలను ఒకకొకరు పంచుకోవడం ద్వారా మానసికంగా ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.
నిత్యజీవితంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలని, తద్వారా మెరుగైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదని, ఏవైనా సమస్యలుంటే ఆత్మహత్యల నివారణకు ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సాంత్వన పొందాలని కోరారు. అనంతరం మారథాన్ విజేతలకు డీజీపీ బహుమతులు ప్రదానం చేశారు.