IIM | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ఎస్టీ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. వీటిల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటా పడిపోతున్నది. ఐదేండ్లుగా ఎస్టీ వర్గాల విద్యార్థులు వీటివైపు చూడటం లేదు. ఎస్సీ విద్యార్థులదీ అదే పరిస్థితి కావడం గమనార్హం. 2017 -18లో ఎస్టీల నమోదు 8.07 శాతముంటే, 2022 -23కు వచ్చేసరికి 5.90శాతానికి తగ్గింది. ఎస్సీల నమోదు 2017 -18లో 14.58 శాతముంటే మధ్యలో 15 శాతానికి చేరి ఆ తర్వాత 14.88శాతానికి పరిమితమైంది. అయితే, నమోదు విషయంలో ఎస్సీ విద్యార్థుల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉండటం విశేషం. ఆసక్తికరమైన ఈ విషయాలు కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన వార్షిక నివేదికలో వెలుగు చూశాయి. దేశంలో 20 ఐఐఎంలుండగా.. 2022 -24 విద్యాసంవత్సరానికి దేశంలోని అన్ని ఐఐఎంలలో 1,082 మంది ఎస్సీ, 429 మంది ఎస్టీలు అడ్మిషన్లు తీసుకొన్నారు.
ఐఐఎంలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. త్వరలోనే అడ్మిషన్లు ప్రారంభంకానున్నాయి. మొత్తం సీట్లతో 15శాతం ఎస్సీలకు, 7.5శాతం సీట్లను ఎస్టీలకు రిజర్వ్చేస్తారు. అయితే ఒక్క 2021-22విద్యాసంవత్సరంలోనే కోటాకు మించి ఎస్సీ విద్యార్థులు ఐఐఎంలో అడ్మిషన్లు పొందారు. ఇక ఎస్టీల అడ్మిషన్లను పరిశీలిస్తే ఒక్క 2017 -18 మినహా గత ఆరు విద్యాసంవత్సరాల్లో ఎప్పుడు కూడా మొత్తం 7.5 శాతం ఎస్టీల సీట్లు భర్తీకాలేదు. ఐఐఎంలు అందుబాటులో లేకపోవడం, క్యాట్ పరీక్ష అత్యంత కఠినంగా ఉండటంతోనే రిజర్వేషన్ క్యాటగిరీ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇక భాషా సమస్య, కార్పొరేట్ కొలువుల పట్ల ఆసక్తి లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంటుందన్న వాదనలున్నాయి.