Jagga Reddy | కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య కంటే ఆ పార్టీ సీఎం అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతున్నది. ఎన్నికలలో పోటీ చేస్తున్న వారే కాకుండా రాజకీయాలను వదిలేసిన నాయకులు కూడా సీఎం పోస్టుపై కన్నేశారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నట్టు తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ మరో పదేండ్లకైనా అయి తీరుతానని ప్రస్తుతానికి మాత్రం వాయిదా వేసుకున్నారు. అంటే?…మరో పదేండ్ల దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని పరోక్షంగా చెప్పడమే కదా?! కాగా కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ తమకు తాము సీఎం అభ్యర్థిగానే భావిస్తున్నారు. వీరిలో ఎవరూ మంత్రుల ఊసే ఎత్తడం లేదు.
ఇంతకు వారి సర్కార్లో మంత్రుల పోస్టులు ఉంటాయా? లేక వారానికో, నెలకో ఒక్కరి చొప్పున సీఎం పదవిని పంచుకుంటారా? అన్నది అర్థం కాని విషయం. అయినా, ఒకే పార్టీలో ఇంత మంది సీఎం క్యాండేట్లా? ఈ పరిస్థితి మరే పార్టీలో ఉండదు. కారణం ఏమై ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడిని అడిగితే, తమని ప్రజలు ముందు ఎమ్మెల్యేగా గెలిపిస్తారో లేదోనన్నది ఆ అభ్యర్థుల భయం. తాను సీఎం క్యాండేట్నని చెబితే కనీసం నాలుగు ఓట్లన్నా పడుతాయన్నది వారి ఆశ… అని సెలవిచ్చారు.