కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నెలకు పదివేల జీతమే వచ్చినా అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.వెయ్యి దాచుకునేవాళ్లం. ఇప్పుడు ముప్పై వేలు వస్తున్నా.. ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇది ఓ వేతనజీవి ఆవేదన!
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం పాకడం మొదలు పెట్టింది. ఆ తర్వాత నడవడం ప్రారంభించింది. ఇప్పుడు పరిగెడుతున్నది. వచ్చే ఏడాది దూకుడు పెంచుతుంది. ఇది ఆర్థిక విశ్లేషకుల ఆందోళన.
సామాన్యుల ఆవేదన, ఆర్థిక విశ్లేషకుల ఆందోళనలకు తగ్గట్టుగానే వచ్చే ఏడాది మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్), అంతర్జాతీయ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐపీఎస్వోఎస్ నిర్వహించిన సర్వే హెచ్చరిస్తున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది 2023లోనైనా నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తాయా? దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా? ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందా? నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? వ్యాపారాలు కళకళలాడుతాయా? కనీసం అప్పైనా దొరుకుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆందోళనకర జవాబులే ఎదురొస్తున్నాయి. ఇవే అంశాలపై దేశవ్యాప్తంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్),అంతర్జాతీయ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐపీఎస్వోఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పాల్గొన్నవారు తీవ్రస్థాయిలో భయాందోళనలు వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే సామాన్యుల పాలిటశాపంగా మారాయని ముక్తకంఠంతో చెప్పారు. గత అక్టోబర్ 21 నుంచి నవంబర్ వరకు కొనసాగిన సర్వే వివరాలను ఐపీఎస్వోఎస్ వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై గతకొంతకాలంగా పలువురు ఆర్థికవేత్తలు వ్యక్తంచేస్తున్న భయాందోళనలనే సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు బలపరిచారు.
కేంద్రం విధానాలతోనే దయనీయ పరిస్థితి
ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది వివిధ వర్గాల ప్రజలపై వేర్వేరు ప్రభావాలను చూపుతున్నది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశ, స్థాయిలను ప్రభావితం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల పుణ్యమే ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని ఆర్థిక విశ్లేషకులు ఘోషిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోకపోతే దేశ ఆర్థిక ప్రగతి ఎన్నో ఏండ్లు వెనక్కి దిగజారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఇకనైనా మేలుకోకుంటే శ్రీలంక దుస్థితే వస్తుందని పలువురు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో ఎటువంటి మార్పూ కనిపించడం లేదు. ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోతున్నది. ప్రస్తుత ఆర్థిక మందగమనానికి, రాబోయే సంవత్సరం ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి మోదీ అసమర్థ ఆర్థిక విధానాలే కారణమని దేశంలోని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 69% మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
సర్వేలో వెల్లడైన అంశాలు ఇవీ