హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్మించిన అమెరికా కాన్సులేట్ నూతన భవనం సోమవారం ప్రారంభమైంది. ఈ సం దర్భంగా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వ్యాంలో ఇదో మైలురాయిగా అభివర్ణించారు. తన ట్విటర్ ఖాతాలో ఆమె సంతోషాన్ని పంచుకున్నారు. ‘34 కోట్ల డాలర్లతో అత్యాధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించాం. ఈ పెట్టుబడి భారత్తో అమెరికాకు ఉన్న బంధంలో భాగం. కొత్త యూఎస్ కాన్సులేట్ జనరల్ వద్ద అమెరికా జెండాను ఎగురవేశాం.. ఈ రోజు ఈ అద్భుతమైన సదుపాయం సాధ్యమయ్యేలా కృషి చేసిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు’ అని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో యూఎస్-భారత్ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆమె చెప్పారు. కొత్త కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్టు వెల్లడించారు. కాన్సులేట్ కార్యాలయం ఇప్పటివరకు బేగంపేటలోని పైగా ప్యాలెస్లో కొనసాగింది. ఈ నెల 15వ తేదీ నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి అధికారికంగా కొత్త కార్యాలయంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. కార్యాలయ తరలింపులో భాగం గా ఈ నెల 15 నుంచి 22 వరకు వీసా ఇంటర్వ్యూలు నిలిపివేశారు. కొత్త కార్యాలయంలో 23నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభిస్తారు.