అతడి పేరు అవినాష్. సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతడి కూతురు వర్షిణికి నాలుగేండ్లు. మనస్పర్థల కారణంగా భార్య అతడికి దూరంగా ఉంటున్నది. అప్పటి నుంచి కుమార్తె ఆలనాపాలనను తానొక్కడే చూసుకుంటూ వస్తున్నాడు. స్కూల్లో చేర్చే సమయం రావడంతో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసి స్నేహితులతోపాటు తను కూడా అడ్మిషన్ లెటర్ను డ్రాప్బాక్స్లో వేశాడు. కొన్ని రోజులకు అవినాష్ స్నేహితులందరికీ స్కూల్ నుంచి ఫోన్ చేసి ఇంటర్వ్యూలకు పిలిచినా, అతడికి మాత్రం పిలుపు రాలేదు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు. సింగిల్ పేరెంట్ కావడంతో అడ్మిషన్ ఇవ్వడానికి స్కూల్ యాజమాన్యం నిరాకరించినట్టు తెలుసుకున్నాడు.
ఆటో డ్రైవర్ అయిన రవికుమార్దీ ఇలాంటి కథే. తాను పెద్దగా చదువుకోకపోవడంతో తన కుమార్తెకైనా మంచి విద్య అందించాలని కలలుగన్నాడు. ప్రముఖ స్కూల్లో అడ్మిషన్కు ప్రయత్నిస్తే ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఇంటర్వ్యూలో ఇంగ్లిష్లో జవాబులివ్వలేకపోవడంతో అడ్మిషన్ దొరకలేదు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 ( నమస్తే తెలంగాణ ): ఇది ఒక్క అవినాష్కో, రవికుమార్కు మాత్రమే ఎదురైన ఘటనలు కావు. నగరంలో చాలామంది ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. సింగిల్ పేరెంట్ అని, తల్లిదండ్రులు చదువుకోలేదని అడ్మిషన్ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. స్కూల్ అడ్మిషన్ ఎలిమినేషన్ జాబితాలో తొలుత వీరి పేర్లే ఉంటున్నాయి.
కొత్త సంవత్సరం ప్రారంభంతోనే చాలా వరకు ప్రైవేటు స్కూళ్లు వచ్చే అకడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాయి. కొన్ని స్కూళ్లు ఎల్కేజీ నుంచి, మరికొన్ని నర్సరీ నుంచి అడ్మిషన్లు ఆహ్వానించాయి. మరికొన్ని స్కూళ్లలో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయి కూడా. జాతీయ, అంతర్జాతీయ సిలబస్ అందించే పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇవి, సింగిల్ పేరెంట్స్కు, పెద్దగా చదువుకోని తల్లిదండ్రుల పిల్లలకు అడ్మిషన్ నిరాకరిస్తుండడంపై పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు పావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు.
అందుకే నిరాకరణ
సింగిల్ పేరెంట్, విద్యార్హతలు పెద్దగా లేని తల్లిదండ్రుల పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించడం వెనక కుట్ర దాగి ఉందని నిపుణులు చెప్తున్నారు. పెద్దమొత్తంలో ఫీజులు చెల్లించే స్తోమత ఉన్నా సింగిల్ పేరెంట్స్ పిల్లల కోసం సమయం కేటాయించలేరని, విద్యలేని తల్లిదండ్రులు తమ పిల్లలతో హోంవర్కులు సరిగా చేయించలేరన్న సాకుతోనే వారికి అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు సమయం కేటాయించకుంటే వారు తరగతిలో వెనకబడే అవకాశం ఉందని, తద్వారా స్కూలుకు చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వారు ఇలాంటి వింత ధోరుణులను తెరపైకి తెస్తున్నారని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా ఈ విషయంలో పూర్తి వ్యాపార దృక్పథమే కనిపిస్తున్నదని చెప్తున్నారు. కాబట్టి విద్య పేరుతో వ్యాపారం చేసే స్కూళ్లకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని సలహా ఇస్తున్నారు. అంతేకాదు, పై రెండు కారణాలతో అడ్మిషన్ నిరాకరించే స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
సింగిల్ పేరెంట్, తల్లిదండ్రులకు విద్యార్హత లేదన్న కారణాలతో అడ్మిషన్ నిరాకరించడం పూర్తిగా నేరం. దీని వెనక స్కూల్ యాజమాన్యాల వ్యాపార కుట్ర ఉంది. ఇటువంటి వారి వల్ల తమకు ప్రయోజనం ఉండదనే ఇలాంటి పనికి పాల్పడుతున్నారు. పిల్లలు బాగా చదవకపోతే పేరెంట్స్దే తప్పని ఎదురుదాడికి దిగుతున్నారు. పోటీ ప్రపంచంలో అందరూ హై బడ్జెట్ స్కూళ్లనే ఎంచుకుంటున్నారు. కానీ, ఆ స్కూళ్లలో ఎలాంటి విద్య అందుతున్నదన్న విషయం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అరాచకంగా వ్యవహరించే ఇలాంటి స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-జగదీశ్కుమార్, ప్రధాన కార్యదర్శి, నియోకర్సర్ సొసైటీ