హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు. విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని, ఫలితంగా సమయం సరిపోలేదని వాపోయారు. ఈ ఏడాది వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం రెండింటిలోనూ ‘స్టేట్మెంట్’ తరహా ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. ఒక ప్రశ్నకు జవాబులుగా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి, వాటిల్లో ఏది సరైందో గుర్తుపట్టాలని సూచించారు. దీంతో నాలుగు స్టేట్మెంట్లు చదవడానికే ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు తెలిపారు. ఫిజిక్స్ పర్వాలేదని, రసాయన శాస్త్రంలో ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని తెలిపారు.
గత నాలుగేండ్ల నీట్ తీరును గమనిస్తే.. 2020లో పేపర్ చాలా సులభంగా వచ్చిందని, 2021లో పేపర్ పర్వాలేదని, గత ఏడాది కాస్త కఠినంగా ఉన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో గత మూడేండ్లలో వరుసగా ఓపెన్ కటాఫ్ 147, 138, 117 గా నమోదై, ప్రతిసారి కాస్త తగ్గినట్టు వెల్లడించారు. ఈ ఏడాది పేపర్ పెద్దగా కఠినంగా లేకపోయినా.. సమయం ఎక్కువగా తీసుకోవడంతో కటాఫ్ మరింత తగ్గే అవకాశం ఉన్నదని నీట్ శిక్షకుడు శంకర్ రావు విశ్లేషించారు. నిరుడు కన్వీనర్ కోటాలో తెలంగాణలో 450 మార్కులకు కటాఫ్ వచ్చిందని, ఈసారి 435-430 మధ్యకు తగ్గవచ్చని అంచనా వేశారు.