హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 పరీక్షలను ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. అయితే, పరీక్షల నిర్వహణలో ఒకవేళ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వినియోగించుకొనేందుకు ఏప్రిల్ 13, 15ను రిజర్వ్ తేదీలుగా ప్రకటించింది. బుధవారం నుంచే ప్రారంభమైన దరఖాస్తు నమోదుకు మార్చి 12 రాత్రి 9 గంటల వరకు గడువు ఇచ్చారు. గత షెడ్యూల్ ప్రకారం మార్చి 7 వరకే దరఖాస్తుకు చాన్స్ ఉండగా, తాజాగా మార్చి 12కు పొడిగించారు. కాగా, జేఈఈ మెయిన్ -1ను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించి, ఇటీవలే ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
జేఈఈ మెయిన్-1కు హాజరైన వారు కూడా మెయిన్ -2కు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https ://jeemain.nta.nic. in లేదా 011-40759000, 011 -69227700 నంబర్లను సంప్రదించాలని ఎన్టీఏ పరీక్షల విభాగం డైరెక్టర్ సాధన పుష్కర్ వెల్లడించారు. రాష్ట్రంలో హయత్నగర్, హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.