భీంపూర్/దండేపల్లి, సెప్టెంబర్ 5: రాష్ర్టానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెదోడ్కర్ సంతోష్కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపెల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అర్చన ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను స్వీకరించారు. వారిని శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు, పురస్కారాలను అందజేశారు.
అర్చన 2018లో జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు, 2019లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకొన్నారు. సంతోష్, అర్చన అవార్డులు అందుకొన్న సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.