IT | దేశానికే ఐటీ హబ్గా తెలంగాణ అవతరించింది. ఇది కేవలం పెట్టుబడులతోనే సాధ్యం కాలేదు. యువతకు విద్య, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నమూ ఇందుకు కారణం. టాస్క్ వంటి విభాగాన్ని, ఐటీ హబ్లనూ నెలకొల్పి రాష్ట్ర ప్రభుత్వం యువతను ప్రోత్సహించింది. ఫలితంగా నిపుణులు తయారయ్యారు. దేశంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో తెలంగాణ యువతే టాప్లో ఉన్నదని ఎంవోఎస్పీఐ తాజా అధ్యయనం తేల్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అనతికాలంలోనే అనేక రంగాల్లో అగ్రగామిగా అవతరించింది. విద్యారంగంలో విప్లవాత్మకం ప్రగతి సాధించింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను నెలకొల్పి యువతలో విద్య, వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తున్నది. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంతో తమ పిల్లలను ఉన్నత విద్యవైపు నడిపిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) గణనీయంగా వృద్ధి చెందింది. దేశానికే ఐటీ హబ్గా తెలంగాణ అవతరించింది. వీటన్నింటి ఫలితంగా యువత ఎక్కువగా ఐటీ వైపు దృష్టి సారించింది. ఇలాంటి ఎన్నో అంశాలతో తెలంగాణలో యువత కంప్యూటర్ విద్యపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నది. దేశంలోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్పై తెలంగాణ యువత ఎక్కువ నైపుణ్యం సంపాదించింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమే వెల్లడించింది.
దేశంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయడంలో యువత నైపుణ్యంపై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(ఎంవోఎస్పీఐ) అధ్యయనం చేసింది. అర్బన్ ప్రాంతాల్లో 15 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన యువతపై సర్వే చేపట్టింది. ఇటీవలే.. ఆ వివరాలను వెల్లడించింది. అందులో దేశంలోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్పై అవగాహన ఉన్నోళ్లలో తెలంగాణ టాప్లో ఉన్నది. తెలంగాణలోని అర్బన్ ప్రాంతాల్లో ప్రతి 100 మందిలో 10 మందికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయడంపై పట్టు ఉన్నదని తేలింది. తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక రాష్ర్టాలు సైతం ముందున్నాయి. ఆ రెండు రాష్ర్టాల్లోని అర్బన్ ప్రాంతాల్లో 10 శాతం మంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్పై అవగాహన కలిగి ఉన్నారు.
కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయడంలో తెలంగాణ యువతకు బీజేపీ పాలిత రాష్ర్టాలు దరిదాపులో కూడా లేవు. తమిళనాడు 9 శాతంతో రెండో స్థానంలో, 6.5 శాతంతో మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. మిగిలిన రాష్ర్టాలన్నీ 3 శాతం కంటే తక్కువలోనే ఉన్నాయి. కర్ణాటకను మినహాయిస్తే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల పరిస్థితి కూడా అంతే ఉన్నది. దశాబ్దాలుగా బెంగళూరు వంటి ఐటీ సిటీ ఉండటంతో కర్ణాటక రాష్ట్రం కూడా తెలంగాణతోపాటు 10 శాతంతో ముందువరుసలో నిలిచింది. మిగిలిన రాష్ర్టాలన్నింటి పరిస్థితి దయనీయంగానే ఉన్నది. మన పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో 1 శాతం కంటే తక్కువ మందే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయగలిగే యువత ఉన్నారు. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మనకంటే 7 శాతం తక్కువ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ప్రాంతాల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయగలిగిన యువత కేవలం 3 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం. బీహార్, అసోం రాష్ర్టాల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాసే యువత 1 శాతం కూడా లేరు. దేశంలోని రాష్ర్టాల సంగతి పక్కన పెడితే చివరికి జాతీయ సగటును పరిశీలించినా తెలంగాణ అగ్రస్థానంలోనే ఉన్నది.
జాతీయ సగటును పరిశీలిస్తే.. 15 నుంచి 29 ఏండ్లలోపు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయగలిగే యువత కేవలం 3 శాతం మాత్రమే. అంటే.. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ 7 శాతం ఎక్కువగా ఉన్నది. కంప్యూటర్పై అవగాహన తెలంగాణ అర్బన్ ప్రాంతాలతోపాటు రూరల్ ప్రాంతాల్లో నూ మెరుగ్గానే ఉన్నది. ఫైల్, ఫోల్డర్ కాపీ చేయ డం, మూవ్ చేయడం, అదనపు ఫైల్లతో ఈ మె యిల్ పంపడం, కాపీ, పేస్ట్ అంశాలు, కంప్యూటర్ ఆపరేటింగ్ సిల్స్, సాఫ్ట్వేర్ డౌన్లోడ్, సిల్ లెవల్స్కు సంబంధించిన విషయాల్లోనూ ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంత యువత మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. వీటన్నింటిపై అవగాహన ఉన్న 15 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సున్న యువత తెలంగాణలో 8 శాతం ఉన్నారని ఎంవోఎస్పీఐ అధ్యయనం వెల్లడించింది.