కరీంనగర్ కమాన్చౌరస్తా, జనవరి 22 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో కార్పొరేషన్ నిధులు రూ. 15 కోట్లతో నిర్మిస్తున్న కళావేదికకు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి పేరు పెడతామని, అదే ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
సర్వ వైదిక సంస్థానం ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ రోడ్డులో యజ్ఞవరాహ క్షేత్రంలో శ్రీభాష్యం విజయసారథి సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొ న్న మంత్రి గంగుల మాట్లాడుతూ శ్రీభాష్యం విజయసారథి మరణం తీరని లోటని చెప్పారు. జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేక ర్యాక్ ఏర్పాటు చేసి ఆయన రచించిన పుస్తకాలను జిల్లా వాసులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ పండితుడు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ భాష్యం అని కొనియాడారు. ఆయన మరణం దేశానికే తీరని లోటన్నారు.
కరీంనగర్ జిల్లాలో పుట్టి దేశవ్యాప్తంగా సంస్కృతి, భాషా పరిరక్షణకు ఎనలేని కృషి చేశారన్నారు. ఆయనకు పద్మశ్రీ దకడం జిల్లాకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. శ్రీభాష్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు ట్రస్టు తీర్మానించిన పత్రాన్ని మంత్రి గంగుల వినోద్కుమార్కు మేనేజింగ్ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా అతిథులందరూ శ్రీభాష్యం చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
అనంతరం మేనేజింగ్ ట్రస్టీగా శ్రీభాష్యం వరప్రసాద్, సభ్యులుగా కొదుమగళ్ల సుగుణాకరాచార్య, ఎస్బీ కల్యాణి, డీవీ శేషాచార్య, మాదాడి కృష్ణారెడ్డి, ఉచ్చిడి మోహన్రెడ్డి, సాయినేని నరేందర్, వాల రవీందర్ రావు, కసిరెడ్డి వేంకటేశ్వర్రెడ్డి, తొడుపునూరి సతీశ్, నరెడ్ల బాబయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.