నవమాసాలు కడుపులో బిడ్డను మోసిన ఆ తల్లి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నది. ఆమే కాదు.. ఆమె కుటుంబం కూడా ఎంతో సంబురపడిపోయింది. తొందరలోనే తమ ఇంటికి వారసుడు రాబోతున్నాడని ఆనందపడుతున్న సమయంలో వారిపై దేవుడు చిన్నచూపు చూశాడు. పురిట్లోనే శిశువు కన్నుమూసింది. పుట్టిన బిడ్డ చనిపోయిందన్న విషయం కూడా తెలియకముందే ఆ తల్లి కూడా ఆనారోగ్యంతో మరణించింది. మునిమనమరాలిని ఎత్తుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నబామ్మకు.. కళ్లముందు మనమరాలి మృతదేహం కనబడటంతో కుంగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక బామ్మ గుండె ఆగింది. ఇలా ఒకే రోజు ఆ కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం అందర్నీ కలిచివేసింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోడిపుంజుల తండాకు చెందిన ధరంసోత్ మోహన్ భార్య రేణుక 9 నెలల గర్భిణి. నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో ఆమెను మహబూబాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె జ్వరంతో బాధపడుతుంది. ఈ క్రమంలో గురువారం పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పురిట్లోనే శిశువు మృతిచెందింది. కాసేపటికే అనారోగ్యంతో రేణుక కూడా మరణించింది. ఇంటికి మహాలక్ష్మి వస్తుందని ఆశపడిన ఆ కుటుంబం.. తల్లీబిడ్డల మరణవార్త తెలియడంతో విషాదంలో మునిగిపోయింది. ఆ బాధలోనే మృతదేహాలను రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. కానీ మునిమనమరాలిని చూద్దామని ఎదురుచూస్తున్న ఆ బామ్మ జోడ జాంకీ ( 80).. మనమరాలి మృతిని తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. ఈ క్రమంలో గుండెపోటుతో మరణించింది. దీంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.