రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వం నుంచే ముప్పు
ధర్మభిక్షం జయంతి వేడుకల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా
ప్రభుత్వ పథకాలకు ధర్మభిక్షం పేరు: మంత్రి శ్రీనివాస్గౌడ్
ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లోనూ చేర్చాలి: బోయినపల్లి వినోద్కుమార్
రవీంద్రభారతి, ఫిబ్రవరి 15: దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలకు మోదీ ప్రభుత్వం నుంచి పెనుప్రమాదం ఏర్పడిందని, దీనికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ గట్టిగా గళం విప్పారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అభినందించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నేత బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు సభ మంగళవారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ సభకు రాజా ముఖ్యఅథిగా హాజరై మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ రాజీలేని పోరాటం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ప్రభుత్వం, ఒకే భాషా, ఒకే ఎన్నికలు అంటున్నదని, దేశం రాష్ర్టాల కూటమి అనే విషయాన్ని గుర్తించేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. దేశాన్ని నాశనం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ధర్మభిక్షం ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించి, పోరాడిన గొప్ప కమ్యూనిస్టు అని కొనియాడారు. ఆయన పోరాట వారసత్వ స్ఫూర్తితో మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కోపాడుకోవాలని పిలుపునిచ్చారు.
సాగునీటి కోసం పరితపించే వారు
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి కోసం ధర్మభిక్షం పరితపించే వారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వంలో ముందువరుసలో ఉన్నారని, ఆయన ఆకాంక్షలను నెరవేర్చడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ధర్మభిక్షం నిజమైన సమతావాది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రస్తుత సమాజంలో స్వాముల చుట్టూ ఆసాములు చేరారని, రామానుజుడి విగ్రహం ప్రతిష్ఠను కూడా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి వాడుకొంటున్నారని విమర్శించారు.
గొప్ప పోరాటయోధుడు..
ధర్మభిక్షం గొప్ప పోరాటయోధుడని మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన గొప్ప రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. ఏదైనా ఒక ప్రభుత్వ సంక్షేమ పథకానికి ధర్మభిక్షం నామకరణం చేస్తామని చెప్పారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పటు చేయట కోసం సీఎంతో మాట్లాడుతానని వెల్లడించారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ధర్మభిక్షం ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారని వెల్లడించారు. ఆయన పేరులోనే ధర్మం ఉన్నదని, ప్రజల కోసం తన సర్వస్వాన్ని ఫణంగా పెట్టారని అన్నారు. ఆయన మా సూర్యాపేట జిల్లాలో పుట్టడం మా అదృష్టమని పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ.. తనపై ధర్మభిక్షం ప్రభావం చాలా ఉన్నదని, ప్రజాసమస్యలపై స్పందించే వ్యక్తిత్వం ఆయన నుంచే వచ్చిందని చెప్పారు. ధర్మభిక్షం జీవిత చరిత్రను మోడల్స్ సైన్స్ పాఠ్యాంశాంల్లో పొందుపరచాలని విద్యాశాఖ ఏర్పాటుచేసిన సబ్ కమిటీకి లేఖ రాస్తానని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షన జరిగిన ఈ సభలో మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, మధుయాష్కీగౌడ్, అజిజ్పాషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, హైకోర్టు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.