హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సౌర విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యానళ్లపై సబ్సిడీని కుదించడంతోపాటు వాటిపై జీఎస్టీని 12 శాతానికి, దిగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచింది. ఇవి ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న అరకొర సబ్సిడీని కూడా దేశీయంగా తయారైన సోలార్ ప్యానళ్లను వాడితేనే ఇస్తామంటూ మోదీ సర్కార్ షరతు విధించింది.
ప్రస్తుతం దేశంలో సోలార్ ప్యానళ్లకు డిమాండ్ అధికంగా ఉన్నా వాటి తయారీ అంతంత మాత్రంగానే ఉన్నది. దీనిని సొమ్ము చేసుకొనేందుకు కంపెనీలు సోలార్ ప్యానళ్ల ధరలను భారీగా పెంచేశాయి. 2 కిలోవాట్ల సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకొనే వినియోగదారుడిపై అదనంగా రూ.17,134 భారం పడనున్నది. 3 కిలోవాట్లకైతే ఈ భారం రూ.34,126గా ఉంటుందని అంచనా. తెలంగాణలో స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇప్పించి సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ సంఘాలకు శరాఘాతంగా మారింది.