హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై మోదీ సర్కారు ఆది నుం చి వివక్షను కొనసాగిస్తూనే ఉన్నది. దేశ ఆర్థికంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణకు నిధులివ్వకుండా ఏటా వేధిస్తూనే ఉన్నది. బీజే పీ పాలిత రాష్ర్టాలకు మాత్రం నిధుల వరద పారిస్తున్నది. తెలంగాణతో పోలిస్తే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకూ భారీగానే నిధులిస్తున్నది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల విషయంలో ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది.
సాధారణంగా రాష్ర్టాలకు కేంద్రం రెండు రకాలుగా సాయం అందిస్తుంది. వాటిలో కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు చట్టబద్ధంగా దక్కాల్సిన వాటా మొదటిదైతే.. వివిధ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రెండోది. ఈ రెండింటి విషయంలోనూ తెలంగాణపై కేం ద్రం వివక్ష చూపుతూనే ఉన్నది. 2022-23లో అన్ని రాష్ర్టాలకు ఆశించిన స్థాయిలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం అంచనాల్లో కేవలం 31 శాతమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నది. ప్ర స్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. తొలి 5 నెలల్లో 5 శాతమే ఇచ్చింది. ఈసారి కేంద్రం నుంచి తెలంగాణకు అందే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరింత తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
పదేండ్లుగా అదే వివక్ష
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన మోదీ.. రా ష్ట్రంపై ఆది నుంచి విషం కక్కుతూనే ఉ న్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలో కేంద్రం నుంచి రూ.21,720 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేయగా.. మోదీ సర్కారు రూ. 6,489 కోట్లు మాత్రమే ఇచ్చింది. గడిచిన తొమ్మిదేండ్లలో 2019-20, 2020-21 మి నహా మిగిలిన అన్ని ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల కంటే తక్కువే. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకు సైతం కేంద్రం బాగానే నిధులిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఛత్తీస్గఢ్కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపేణా రూ.16,750 కోట్లు వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. కేంద్రం రూ.13,148 కోట్లు (అంచనాలో 79 శాతం) ఇచ్చింది.
మనపై చిన్నచూపు.. వాళ్లకేమో పెద్దపీట
గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల విడుదల లో తెలంగాణకు నానా రకాల కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ పా లిత రాష్ర్టాలకు మాత్రం పెద్దపీట వేస్తున్న ది. ప్రత్యేకించి ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్పై వల్లమాలిన ప్రేమను కురిపిస్తున్నది. ఏటా ఆ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు మించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.15,982 వేలకోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందని గుజరాత్ తన బడ్జెట్లో ప్రతిపాదించగా.. కేంద్రం రూ.23,131 కోట్లు అందించింది. ఇది ఆ రాష్ట్ర అంచనా కంటే 45 శాతం అధికం.