హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి 2023-24 ఆశాజనకంగా ప్రారంభమైంది. మొదటి నెలలోనే మంచి రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,59,861 కోట్ల రాబడి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. ఏప్రిల్లో రూ.15,085 కోట్లు వచ్చింది. ఇందులో పన్నుల రూపేణా రూ.9,698 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.4,081 కోట్లు, అమ్మకం పన్ను కింద రూ.2,303 కోట్లు వచ్చినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు నివేదించింది. కాగా, తెలంగాణ ప్రగతికి అడుగడుగునా మోకాలడ్డుతున్న నరేంద్రమోదీ సర్కార్.. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నది.
గత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇవ్కుండా వేధించిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నది. 2023-24లో కేంద్రం నుంచి మొత్తం రూ.41,259 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ వస్తుందని వార్షిక బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్లో మోదీ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.