హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకొన్నది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మంగళవారం షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు తమ వాదనలను వినిపించడంతోపాటు సాక్ష్యాధారాలను సమర్పించాల్సి ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఎదుట పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు దానం, కడియం సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. గత నెల 18న ఈ కేసులో పిటిషనర్ పాడి కౌశిక్రెడ్డిని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. 19న కడియం తరఫు లాయర్లు వివేకానందగౌడ్ను ప్రశ్నించారు.
స్పీకర్ జారీచేసిన విచారణ షెడ్యూల్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 27వ తేదీన ఉదయం 11:00 గంటలకు విచారణ ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం 12:00 గంటలకు విచారణ చేపడుతారు. 28వ తేదీన ఉదయం 11:00 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఉంటుంది. ప్రతివాది స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున సాక్ష్యాధారాలను సేకరిస్తారు.