హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగ మే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ క్షకసాధింపు చర్యలు ఎంతోకాలం సాగవని, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో శుక్రవారం బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమను ఎదురించే వారిని రాజకీయాల నుంచే నిర్మూలించటమే దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానమని, తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అందులో భాగమేనని నామా నాగేశ్వరరావు చెప్పారు.
మహారాష్ట్రలో శివసేన పార్టీని బీజేపీ ఏం చేసిందో దేశం ఇంకా మరచిపోలేదని అన్నారు. ఏ రాష్ర్టానికి సంబంధించిన పాలసీలు ఆ రాష్ర్టానికి అనుగుణంగా ఉంటాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర పునర్నిర్మాణంలో తనవంతు పాత్రపోషిస్తున్న ఎమ్మెల్సీ కవితను ఒక మహిళ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారని, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలించి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఒడిదొడుకులు కొత్తకాదని రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తమకు లొంగని వారిని అరెస్ట్ చేసేందుకు పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు తెలంగాణ ఉద్యమం నుంచే అనేక ఒత్తిళ్లు ఎదురైనా వెరవలేదని చెప్పారు. అనేక పార్టీలు అనేక విధాలుగా కేసీఆర్ను లొంగదీసుకోవాలని చూసినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించిన తీరును గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవిత అవినీతి పాల్పడ్డారన్నది కేవలం ఆరోపణనేనని స్పష్టంచేశారు. ఆమెకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే బీజేపీ వ్యూహంలో భాగమే ఈ అరెస్ట్ అని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు 200 ఈడీ కేసులు ఉంటే, పదేండ్ల బీజేపీ పాలనలో వాటి సంఖ్య 2,954 దాటిందని ఉదహరించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ది చెప్తారని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
రాజ్యాంగ సంస్థలను తమ సొంత సంస్థలుగా వాడుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించకతప్పదని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను తమ రిమోట్ కంట్రోల్లాగా బీజేపీ వాడుకుంటున్నదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, రాజాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.