హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వివిధ న్యూస్ చానళ్లు, మీడియా సంస్థల్లో పని చేస్తున్న అక్రెడిటేషన్ కార్డు లేని మహిళలందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇటీవలే మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.
ఏప్రిల్ 2వ తేదీ మినహా 9వ తేదీ వరకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అక్రిడిటేషన్ ఉన్న వారితో పాటు లేని వారికి సైతం మాసబ్ట్యాంకులోని కార్యాలయంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు హెల్త్ చెకప్ చేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళా జర్నలిస్టులంతా వినియోగించుకోవాలని కోరారు.