హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కోసం యాజమాన్యం రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు యాజమాన్యం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)తో ఎంవోయూ కుదుర్చుకున్నది. గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన సమావేశంలో అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకులో ప్రస్తుతం ఖాతాలు ఉన్న 11,182 మంది సింగరేణి కార్మికుల ఖాతాలను ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చుతారు. తద్వారా ప్రతి కార్మికునికి ఉచితంగా రూ.55 లక్షల ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది. సమావేశంలో యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాసరరావు, సింగరేణి వెల్ఫేర్ అండ్ రిక్రూట్మెంట్ జీఎం కే బవవయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా మరిన్ని రాయితీలు కల్పించడం కోసం ప్రత్యేక చొరవ తీసుకొంటున్నాం. సంస్థకు కార్మికుల ప్రయోజనాలే ప్రధానం. ఇటీవల శ్రీరాంపూర్లో ఒక కార్మికుడు చనిపోతే అతని కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా రూ.74 లక్షలు చెల్లించాం. గత ఏడాది వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన 8 మంది ఉద్యోగులకు కంపెనీ చొరవతో రూ.3.5 కోట్ల ప్రమాద బీమా పరిహారాన్ని యూనియన్ బ్యాంక్ అందజేసింది.
– ఎన్ బలరాం, సింగరేణి సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్