చేర్యాల, జూలై 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. మల్లన్నను సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలలో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రద క్షిణలు, కోడెల స్థంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.