హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ సంక్షోభం మొదలైంది. పలు ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీల్లో ఒకేసారి వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. అదే సమయంలో ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీలు భారీ వేతనాలతో ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. పుల్స్టాక్ డెవలపర్ ఉద్యోగానికైతే ఏకంగా 70-120 శాతం పెరుగుదలతో వేతనాలిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రముఖ కంపెనీలు ఏడాది కాలంలో సుమారు 2.3 లక్షల మంది ఐటీ ఉద్యోగులను నియమించుకొన్నాయి. ప్రస్తుతానికైతే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలే సురక్షితమని నిపుణులు చెప్తున్నారు. దేశంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఒక్కసారిగా 400 శాతం పెరిగిందని పలు ఉద్యోగ నియామక సంస్థలు వెల్లడించాయి. అయితే, ఇదే పరిస్థితి మునుముందు ఉండకపోవచ్చనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగం పూర్తిగా డిజిటలైజేషన్కు మారడం, ఆర్థిక వ్యవస్థలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత కార్యకలాపాలకు వెళ్లడంతో ఐటీ రంగంలో ఉద్యోగాలకు ఎప్పుడూ లేనంత డిమాండు పెరిగింది. ఐటీ కంపెనీలకు దేశ, విదేశీ ప్రాజెక్టులు గణనీయంగా పెరగడంతో కంపెనీలకు ఉద్యోగుల అవసరం పెరిగిపోయింది. దీంతో కొన్ని ఐటీ కంపెనీలు ఆయా టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి, టీమ్ లీడర్లు, మేనేజర్ పోస్టులకు భారీగా ప్యాకేజీలు ఇచ్చి ఉద్యోగాల్లో నియమించుకొంటున్నాయి.
అయితే, ఈ పరిస్థితి మునుముందు కొనసాగే అవకాశం ఉండదని, అమాంతంగా పెరిగిన వేతనాలు ఒక బుడగ లాంటివేనని నిపుణులు చెప్తున్నారు. ఆ బుడగ ఎప్పుడైనా పేలవచ్చని, దాంతో ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదని అంటున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి మాంద్యం భయాలు అలముకొంటున్నాయి. దీంతో ఐటీ కంపెనీల షేర్ల విలువ తగ్గుతున్నది. ఇది మన దేశంలోనూ ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఐటీ కంపెనీల్లో వేతనాల చెల్లింపుల్లో కొంత సర్దుబాటు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.