కొల్లాపూర్, నాగర్ కర్నూలు : పాలమూరు ప్రజల చిరకాల వాంఛ సాకారం కాబోతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు. సెప్టెంబర్ 16వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( Chief Minister KCR ) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (Palamuru Rangareddy Lift Project) ను నార్లపూర్ ఇంటేక్ దగ్గర ప్రారంభించనున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను విప్ గువ్వల బాలరాజు (Mla Balaraju), కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy), జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కృష్ణా నది పాలమూరు గుండా ప్రవహిస్తున్నప్పటికీ తాగడానికి గుక్కెడు నీళ్లు కరువయ్యాయని పేర్కొన్నారు. అప్పటి పాలకులను అడిగితే ‘ కృష్ణానది ఏమో దిగువన ప్రవహిస్తుంటే పాలమూరు మాత్రం గడ్డమీద ఉన్నది. నీళ్లు ఎలా వస్తాయి ’ అని హేళన చేసేవారని గుర్తుచేశారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ అలంపూర్ వద్ద పాలమూరు గోస చూసి కన్నీరు పెట్టుకున్నారని అన్నారు. ప్రాజెక్టులో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్లు ఏర్పాటు చేసి నీళ్లను ఎత్తి పోసేవిధంగా ప్రాజెక్టును నిర్మించడం గొప్ప విషయమన్నారు.
సెప్టెంబర్ 16 వ తేదీన నార్లాపూర్ కంట్రోల్ రూం వద్ద స్విచ్ ఆన్ చేసి ఇంటేక్ వద్ద కృష్ణమ్మకు సీఎం కేసీఆర్ (CM KCR) పూలు చల్లనున్నారని వెల్లడించారు. అదే రోజున ఉమ్మడి పాలమూరులోని ప్రతి తండా, ప్రతి గ్రామం నుంచి ప్రజలు కలశాలతో వచ్చి కృష్ణా నది నీళ్లు తీసుకొని వెళ్లి అన్ని దేవాలయాలలోని దేవతల పాదాలు కడగనున్నారని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం కాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నింటినీ పటాపంచలు చేసి పర్యావరణ అనుమతులు(Environmental clearance) సాధించడంతో పాటు అన్ని అనుమతులను సాధించారని అన్నారు.
ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు Minister KTR) అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నారని మంత్రి తెలిపారు. ఇటు ప్రాజెక్టులు, అటు పరిశ్రమలతో ఇక పాలమూరు ఏనాటికీ వలసల జిల్లా కాబోదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి నార్లాపుర్ కంట్రోల్ రూం వద్ద ప్రాజెక్టు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ మనోహర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.