హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్ష కొత్తగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పడంతో.. ఆ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్లిం ది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది. అయితే, కొత్తగా మరికొన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిలోనూ సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి రావడంతో సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. కమిషన్ అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపితే కొత్త పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నది.