Congress | నల్లగొండ, మే 4: శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఉన్నప్పటికీ.. నల్లగొండలో బీసీలు, దళితులకు ఎందుకు స్థానం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని నాయకులు నిలదీశారు. ఈ నెల 8న హైదరాబాద్లో ప్రియాంకా గాంధీ నిర్వహించే సభకు తరలిరావాలని కోరుతూ గురువారం నల్లగొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జానారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, పున్న కైలాష్ నేత, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య, తండు సైదులుగౌడ్ హాజరయ్యారు. ప్రెస్మీట్కు ముందు వారు జానారెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు. గత నెల 28న నల్లగొండలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో నిర్వహించిన సభలో మొత్తం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమేంటని ప్రశ్నించారు.
‘చెరుకు సుధాకర్ను స్టేజి మీదికి పిలిస్తే నేను రానని కోమటిరెడ్డి అంటేనే నన్ను పిలువలేదని, దీనిపై పీసీసీ అధ్యక్షుడు లేదా మీరు ఎందుకు స్పందించరని’ చెరుకు సుధాకర్ జానారెడ్డిని అడిగారు. ఇది కాంగ్రెస్ పార్టీనా? లేదా కోమటిరెడ్డి పార్టీనా? చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో ఉంటూ బీజీపీకి ఓట్లు వేయాలని మునుగోడులో చెప్పిన కోవర్టు రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోరని పున్న కైలాష్ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో ఫ్లెక్సీలు పెడితే కోమటిరెడ్డి ఎందుకు తొలగించారని సైదులుగౌడ్ అడిగారు. ఎస్సీ, బీసీలను విస్మరించి ఒకే సామాజిక వర్గం నాయకులు స్టేజీ మీద ఉండటం ఎంతవరకు సమంజసమని, తమ ఓట్లు అవసరం లేదా? అని నిలదీశారు.
పార్టీకి తాము అవసరం లేదంటే చెప్పండి.. తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు. సీనియర్ నాయకులు పట్టించుకోకుంటే ఎలా అని జానారెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయాలు తన దృష్టికి రాలేదని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూస్తానని జానారెడ్డి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఇదే విషయమై ప్రెస్మీట్లో విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారు ఉంటారని, ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని జానారెడ్డి బదులిచ్చారు.