హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నాగార్జునసాగర్ డ్యామ్ను తాత్కాలికంగా తన ఆధీనంలోకి తీసుకున్నది. సాగర్ కుడి కాలువ ద్వారా సోమవారం ఏపీకి నీటిని విడుదల చేసింది. సాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ ప్రతిపాదనలు చేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలని బోర్డు తెలంగాణకు లేఖ రాయగా, బోర్డే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీకి 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.
చట్టప్రకారం సాగర్ నుంచి నీటిని విడుదల చేసే బాధ్యత తెలంగాణకే ఉన్నది. ప్రస్తుతం కుడికాలువ ఏపీ ఆధీనంలో ఉంది. తామే ఏపీకి నీటిని విడుదల చేస్తామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వెల్లడించారు. కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్ను స్వయంగా కలిసి స్పష్టంచేశారు. ఒకవేళ అది కుదరకపోతే బోర్డు అధికారులే నీటిని విడుదల చేయాలని వాదించారు. దీంతో కేఆర్ఎంబీ చైర్మన్ హుటాహుటినా బోర్డు సభ్యులను సాగర్కు పంపించారు. బోర్డు సభ్యులతో కుడికాలువ గేట్లనుఎత్తించి నీటిని విడుదల చేశారు. ఈ అంశంపై మంగళవారం ప్రత్యేకంగా ఇరు రాష్ర్టాల అధికారులతో సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణకు సమాచారం అందించింది.